- పర్యాటక ప్రాంతాల సందర్శనకు 6 బస్సులు తెచ్చిన హెచ్ఎండీఏ
- ఎక్కడెక్కడికి ఎప్పుడు తిరుగుతాయో ఎవరికీ తెలియదు
- ఉచిత ప్రయాణమని అవేర్నెస్ కల్పించని ఆఫీసర్లు
- నెలకు రూ . కోటిన్నర ఖర్చు
- తమకు ఇచ్చెయ్యాలంటున్న టూరిజం శాఖ
హైదరాబాద్సిటీ, వెలుగు: సిటీ పర్యాటక ప్రాంతాలపై ప్రచారం నిర్వహించడంతో పాటు వాటిని చూడాలనుకునేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి హెచ్ఎండీఏ తీసుకువచ్చిన డబుల్డెక్కర్బస్సులు ప్రయోజనం లేకుండా పోయాయి.
జనాలకు వాటి గురించి తెలియకపోవడం, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తాయో అధికారులు అవగాహన కల్పించకపోవడం, ఉచితంగానే ప్రయాణించవచ్చన్న సంగతి కూడా తెలియకపోవడంతో ఎవరూ ఎక్కడం లేదు. దీంతో వాటి వల్ల ఉపయోగం లేదని టూరిజం డిపార్ట్మెంట్కు బదిలీ చేసే యోచనలో హెచ్ఎండీఏ ఉన్నట్టు తెలుస్తున్నది.
డబుల్ డెక్కర్కు ఉన్న క్రేజ్తో..
ఒకప్పుడు హైదరాబాద్లో ఆర్టీసీ డబుల్డెక్కర్ బస్సులు నడిపింది. నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ డబుల్డెక్కర్బస్సుల్లో ప్రయాణించడానికి ఎంతో ఆసక్తి చూపించే వారు. హాయిగా పైఫ్లోర్లో కూర్చుని నగర అందాలను తిలకించడం కోసం ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు ఎంతో మంది ఇష్టపడేవారు. కానీ కొన్ని కారణాలతో ఆర్టీసీ డబుల్డెక్కర్బస్సులను నిలిపివేసింది.
ఆనాటి అనుభూతులను మళ్లీ ఇప్పటి తరానికి అందించాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏ ఆరేండ్ల కింద మోడ్రన్డబుల్డెక్కర్బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆకట్టుకునే డిజైన్, అద్దాలతో అందమైన బస్సులను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా డ్రైవర్, ఇతర సిబ్బందిని కూడా నియమించుకుంది. వీటిలో నగరంలోని పర్యాటక ప్రదేశాలను ఉచితంగా సందర్శించుకునే అవకాశం కల్పించింది.
ఒక్కో బస్సుకు రూ. 2 కోట్లు
ఒక్కో డబుల్ డెక్కర్ బస్సుకు రూ.2 కోట్లు పెట్టిన హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ (బీపీపీ) ఆధ్వర్యంలో నడిపిస్తోంది. మొత్తం ఆరు బస్సులకు రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. నెలకు మెయింటనెన్స్ రూ. కోటికి పైగానే అవుతోంది.
నెక్లెస్రోడ్ కేంద్రంగా హైటెక్సిటీ రూట్లో మూడు బస్సులను, ట్యాంక్బండ్నుంచి గోల్కొండ రూట్లో రెండు బస్సులు, మరో బస్సును ట్యాంక్ బండ్చుట్టూ సంజీవయ్య పార్కు నుంచి నెక్లెస్రోడ్, పీపుల్స్ప్లాజా, ఎన్టీఆర్గార్డెన్స్, లుంబినీ పార్క్, సెక్రటేరియల్, ట్యాంక్బండ్మీదుగా బోట్స్క్లబ్ వరకూ నడుపుతున్నారు. అయితే ఈ బస్సులపై ఏ రూట్ప్రయాణం అన్నది పేర్కొనడం లేదు.
కేవలం ఉచిత బస్సు అని మాత్రమే రాస్తున్నారు. దీంతో సందర్శకులు ఎక్కడికి వెళ్తుందో తెలియక అస్సలు ఎక్కడం లేదు. కానీ, అధికారులు మాత్రం 60 శాతం ఆక్యుపెన్సీ ఉందని చెప్తున్నారు. కానీ, ఈ డబుల్డెక్కర్బస్సులు ఎక్కడ కనిపించినా లోపల పట్టుమని పది మంది కూడా ఉండడం లేదు. కొన్ని రూట్లలో అయితే ఖాళీగా తిరుగుతున్నాయి.
అలాగే ఏ స్టాప్లో ఆపుతారో, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో.. ఏ రూట్లలో వెళ్తున్నాయన్న విషయాన్ని కూడా ప్రచారం చేయడం లేదు. ఆర్టీసీ బస్సుల మాదిరిగా కనీసం ఎంపిక చేసిన రూట్లలో బస్ స్టాప్లలో ఆపినా ప్రయాణికులు ఎక్కే అవకాశం ఉండేది.
అసలు ఈ బస్సులు ఏ ఉద్దేశంతో నగరంలో తిరుగుతున్నాయో కూడా చాలా మంది తెలియదు. అయితే, బస్సులు రోజూ నడవడం లేదని, ఒకటి రెండు బస్సులు మాత్రమే కొన్ని రూట్లలో నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మాకు ఇవ్వండి : టూరిజం శాఖ
హెచ్ఎండీఏ దగ్గరున్న ఆరు డబుల్డెక్కర్ బస్సులతో ఉపయోగం లేదని వాటన్నింటినీ తమకు బదలాయించాలని టూరిజం శాఖ హెచ్ఎండీఏను కోరుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే టూరిజం శాఖ లెటర్కూడా రాసిందని, చర్చలు జరుగుతున్నాయని ఓ అధికారి చెప్పారు. తాము తీసుకుని తెలంగాణలోని కీలకమైన పర్యాటక కేంద్రాలకు నడపాలని అనుకుంటున్నామని టూరిజం శాఖ చెప్తోంది. ముందుగా వరంగల్ లోని రామప్ప టెంపుల్కు ఈ డబుల్డెక్కర్బస్సుల ద్వారా ప్యాకేజీ అనౌన్స్చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. త్వరలో ఒక నిర్ణయానికి రానున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
అప్పట్లో ‘డబుల్ డెక్కర్’ మర్చిపోలేని అనుభవం
నా చిన్నతనంలో సిటీలో డబుల్డెక్కర్ బస్సులు చాలా రూట్లలో తిరగడం నాకు తెలుసు. 1975 రోజుల్లో కోఠి నుంచి ప్యారడైజ్వరకు, సికింద్రాబాద్ నుంచి అఫ్జల్ గంజ్, చార్మినార్ వరకూ డబుల్డెక్కర్బస్సులు తిరిగేవి. వీటిలో ప్రయాణించడం అంటే ఎంతో సరదాగా ఉండేది.
ఈ బస్సు ఎక్కి పైఅంతస్తులో కూర్చుని ట్యాంక్ బండ్ అందాలు, అబిడ్స్, చార్మినార్ వరకూ ప్రయాణించడం ఇప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం నగరంలో డబుల్ డెక్కర్ఉందన్న విషయం నాకు తెలియదు. ట్యాంక్బండ్ పరిసరాల్లో తిరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాటిపై జనాలకు అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది ఎక్కి ఆదరణ లభించే అవకాశం ఉంటుంది.
- కె. మురళీధర్, అడ్వొకేట్, సికింద్రాబాద్.
మా పేరెంట్స్చెప్తుండే వారు
నగరంలో ఒకప్పుడు డబుల్డెక్కర్ బస్సులు నడిచేవని మా పేరెంట్స్చెబుతుండే వారు. దీంతో నేను కూడా డబుల్డెక్కర్ఎక్కి ప్రయాణిస్తే బాగుండు కదా అనుకునేవాడిని. కానీ, మన సిటీలో కూడా డబుల్డెక్కర్బస్సులు తిరుగుతున్నాయని..ట్యాంక్బండ్, గోల్కొండ వంటి ప్రాంతాల్లో నడుస్తున్నాయని అంటున్నారు.
వాటిని గురించి నేనెక్కడా చదవలేదు. ఇప్పటి వరకూ చూసింది కూడా లేదు. నాలాంటి యూత్అంతా డబుల్డెక్కర్లో జర్నీని ఎక్స్పీరియన్స్చేయాలని అనుకుంటున్నారు. అవి ఎక్కడెక్కడ నడుస్తాయి? ఎన్ని గంటలకు వెళ్తాయో చెప్తే బాగుంటుంది.
- కల్యాణ్, ఓయూ స్టూడెంట్-
